హై అలెర్ట్‌ !

తిరుపతి తుడా : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం మరింత పటిష్ట చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. బుధవారం నాటికి జిల్లాలో 5 కరోనా పాజిటివ్‌ కేసులున్నాయి. గురువారం నాటికి ఆ సంఖ్య 9కి చేరింది. దీంతో జిల్లాలో  అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు హాజరై వచ్చిన తిరుపతికి చెందిన ఓ యువకుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే శ్రీకాళహస్తికి చెందిన మరో వ్యక్తికి, రేణిగుంటకు చెందిన ఇంకోవ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో జిల్లాలో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఇందులో శ్రీకాళహస్తి–3, పలమనేరు–2, ఏర్పేడు–1, గంగవరం–1, తిరుపతి–1, రేణిగుంటలో –1 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. శ్రీకాళహస్తిలోని నాగచిపాళ్యం ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా హైఅలెర్ట్‌ను ప్రకటించి, ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని హెచ్చరికలు జారీచేస్తోంది.